Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 31 నాటికి ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలి కలెక్టర్ ఆనంద్ నెల్లూరు: జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలైనందున రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు సమిష్టిగా కృషి చేసి ఈ నెల 31 నాటికి ఓటరు జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్ నుండి రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యూటేషన్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఉపాధిహామీ పనిదినాల పెంపు, హౌసింగ్ మొదలైన అంశాలపై సబ్కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూలో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల మంజూరు, మ్యూటేషన్ ట్రాన్సాక్షన్లపై తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పి జి ఆర్ ఎస్ లో వచ్చేటువంటి అర్జీలను ఆడిట్ చేసేందుకు ప్రత్యేకంగా పదిమంది అధికారులతో టీమును నియమించామన్నారు. ఈ టీం సభ్యులు జిల్లా మొత్తంలో వచ్చిన అర్జీలను పరిష్కరించిన విధానంను పరిశీలిస్తారని, సరైన కారణం లేకుండా తిరస్కరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవన్నారు. అంతేకాకుండా పి జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారం ఆధారంగా ఆయా అధికారుల ఎ సి ఆర్ లు తయారు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామాల నుండి వివిధ రకాల సేవలు విషయమై నేరుగా కలెక్టరేట్ కు అర్జీదారులు వస్తున్నారని, వారికి మీసేవ లేదా సచివాలయాల ద్వారా సేవల కొరకు దరఖాస్తు చేసుకునే విధంగా వీఆర్వోలు అవగాహన కలిగించాలన్నారు. తహసిల్దార్లు ముటేషన్స్ విషయమై ప్రతి రోజు సమీక్షించుకోవలసిన అవసరం ఉందన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలైనందున రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు సమిష్టిగా కృషి చేసి స్థానిక ఆయకట్టు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఓటరు జాబితా తయారు చేయాలన్నారు. వారికి తగు శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. అదేవిధంగా వర్షాలు తగ్గుముఖం పట్టినందున హౌసింగ్ లో స్టేజ్ కన్వర్షన్ల పై దృష్టి పెట్టాలని, కంప్లీషన్ దశలో ఉన్న ఇళ్లపై శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించిన పరిశీలన వెంటనే పూర్తి చేసి నివేదికలు పంపాలన్నారు. ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, 70 వేల పనిదినాల లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవాలని, అలాగే నరేగా పనుల్లో ప్లాంటేషన్ ఫిట్టింగ్, ఫామ్ పాండ్స్ పూర్తి చేయుటకు మట్టి పనుల్లో లేబర్ కాంపౌండ్ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా పంచాయతీల్లో ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని అలాగే ఓహెచ్ఆర్ ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. ఎటువంటి ఆధారాలు లేని ఎస్ టి లను గుర్తించి ఇప్పటికే కొన్ని మండలాలు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారని, వెంటనే ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటుచేసి వారికి ఆధార్ కార్డు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెండింగ్ లో ఉన్న లైబ్రరీ సెస్సును జిల్లా గ్రంధాలయ సంస్థకు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ , డిఆర్వో లవన్న, డిఎంఅండ్హెచ్వో పెంచలయ్య, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి , హౌసింగ్ పిడి దయాకర్ , పరిశ్రమల శాఖ జియం మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi